వాల్తేర్ డివిజన్ లేకుండా రైల్వే జోనా?

గురువారం, 26 సెప్టెంబరు 2019 (07:32 IST)
వాల్తేర్ డివిజన్ లేకుండా రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయటం వల్ల ఉపయోగం లేదని దక్షిణ మధ్య రైల్వే జీఎంతో విజయవాడలో సమావేశమైన ఎంపీలు తీర్మానించారు.

ద.మ.రైల్వే జీఎంతో మంత్రులు భేటీ వాల్తేర్ డివిజన్ లేకుండా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయటం వల్ల ఉపయోగంలేదని ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎంకు స్పష్టం చేశారు. విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మానేజర్ గజానన్ మల్య తో సమావేశమైన రాష్ట్ర ఎంపీలు తప్పనిసరిగా డివిజన్ ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఏపీలో రైల్వే నియామక బోర్డు (ఆర్ఆర్బీ)ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్న నేపథ్యంలో రైళ్ల అనుసంధానత పెంచాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు.

దొనకొండ-ఒంగోలు మధ్య కొత్త రైల్వే మార్గం పై దృష్టి పెట్టాలనీ, నడికుడి-శ్రీకాళహస్తి పనులు వేగవంతం చేయాలని సూచించారు. * వివిధ ప్రాజెక్టులకు సత్వరమే భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైకాపా లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. వాల్తేర్ డివిజన్ను కొనసాగేలా కేంద్రంతో సంప్రదింపులు చేస్తామని అన్నారు.

విశాఖ-విజయవాడల మధ్య ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రైలు వేయాలని కాకినాడ ఎంపీ వంగా గీత కోరారు.  అనంతపురం జిల్లా నుంచి అమరావతికి కొత్త రైళ్లు వేయాలని, కొండవీడు ఎక్స్ప్రెస్ను రోజూ నడపాలని అనంతపురం,హిందూపురం ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ కోరారు.

రైల్వేలో స్థానిక రాష్ట్రాల వారికి ప్రాధాన్యత ఉండేవిధంగా రైల్వే బోర్డుతో మాట్లాడతానని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు.  సమావేశం మెుదలైన కాసేపటికే ఎంపీ కేశినేని నాని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి బయటకు వచ్చేశారు.

వివిధ అంశాలపై ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా స్పందించడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మల్య మాట్లాడుతూ వివిధ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు