ప్రేమికుల దినోత్సవానికి ముందురోజైన శనివారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం నక్కలవాండ్ల పల్లెకు చెందిన ఎన్. చిన్నప్పరెడ్డి కుమారుడు వేమనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎంబీఏ పూర్తి చేసి స్థానికంగా ఉన్న ఓ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా పని చేస్తున్నాడు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన జిలాన్ అనే వ్యక్తి కుమార్తె షిబియాపై మనస్సుపడ్డాడు.
ఈ విషయాన్ని ప్రియురాలికి తెలిపిన నారాయణ రెడ్డి.. ఆమెకు తిరుపతిలో ఓ కంపెనీలో అకౌంటెంట్గా ఉద్యోగంలో చేర్పించి... అక్కడే ఒక రూం అద్దెకు తీసిచ్చి.. తరచూ వెళ్లి వస్తుండేవాడు. ఈ విషయం నారాయణరెడ్డి తల్లిదండ్రులకు కూడా తెలిసింది. దీంతో వారంతా ఏకమై ఒక రోజున తిరుపతికి వెళ్లి షబియాను కొట్టివచ్చారు. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీ నుంచి షబియా విధులకు రావడం మానేసింది. దీంతో కంపెనీ యజమాని షబియా తల్లిదండ్రులకు సమాచారం చేరవేశాడు.
దీంతో ఆందోళన చెందిన షబియా తల్లి తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. నారాయణరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. తిరుపతిలోనే షబియాను హతమార్చి.. తరిగొండకు తీసుకొచ్చి.. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి ఆవరణలోని చిక్కుడు చెట్టును తొలగించి.. ఆ స్థలంలో గొయ్యి తీసి పాతిపెట్టినట్టు అంగీకరించాడు. తన తల్లితండ్రులకు తెలియకుండానే ఈ పని చేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు.