ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో అన్యాయంపైన, రాజధాని ప్రాంత రైతుల సమస్యల పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హఠాత్తుగా స్పందించడం వెనుక రాజకీయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక పేర్కొంది. పవన్ను ఉపయోగించుకొని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని ఆరోపించింది.
ఇలా జనసేన అధినేత పవన్ను మరోసారి చంద్రబాబు చేతిలో పావుగా మారారని వ్యాఖ్యానించింది. జగన్ పర్యటన ద్వారా గ్రామాల్లోని రైతుల ఆగ్రహావేశాలు ప్రభుత్వం పైన వెల్లడవుతుందని భావించిన ప్రభుత్వం.. పవన్ పర్యటన ద్వారా అవి లేవని చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తోందని పేర్కొంది. చంద్రబాబు తాను చెప్పదలుచుకున్న విషయాలను పవన్ ద్వారా ప్రజలకు చెప్పించే ప్రయత్నాలు చేశారని అభిప్రాయపడింది.