మా నాన్న వివేక హత్య గురించి ఏపీ సీఎం జగన్‌కు ముందే తెలిసింది : సునీత

మంగళవారం, 13 జూన్ 2023 (13:20 IST)
తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసింది అని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అన్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. 
 
దీనిపై విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపిస్తూ పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.
 
'సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు ఆయన హాజరుకాలేదు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారు. అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లినా ఎంపీ మద్దతుదారులు వారిని అడ్డుకున్నారు. సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తూ.. ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారు. అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తోంది. 
 
ఆయనకు అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉంది. సీబీఐ అధికారులపై అవినాష్‌ తప్పుడు ఫిర్యాదులు చేశారు.. వారిపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారు. వివేకా హత్య గురించి సీఎం జగన్‌కు ముందే తెలిసింది" అని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు