వైకాపాకు రంగు పైత్యం .. ప్రతిభా అవార్డులకూ పాకింది....

మంగళవారం, 12 నవంబరు 2019 (12:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు పార్టీ రంగు పైత్యం పట్టుకుంది. ఈ రంగు పైత్య కాస్త ప్రతిభా అవార్డులకు చేరింది. ఇప్పటికే గ్రామ సచివాలయాలే కాకుండా, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, శ్మశానవాటికలు వంటి పలు నిర్మాణాలకు వైసీపీ రంగు వేస్తున్నారు. వీటిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఇచ్చే ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా అవార్డులకూ వైసీపీ రంగు పులమడం గమనార్హం. ఈ అవార్డులను సోమవారం విజయవాడలో సాక్షాత్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందజేయగా, విద్యార్థులకు ఇచ్చిన మెడల్స్‌ ట్యాగులను వైసీపీ రంగుల (నీలం, తెలుపు, ఆకుపచ్చ)తో ముద్రించడంపై విమర్శలు వచ్చాయి.
 
అనంతపురం, కర్నూలు కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో 679 మందికి అందించిన అవార్డులదీ ఇదే తీరు. మెడల్‌ ట్యాగ్‌ వైసీపీ రంగులో ఉన్నది కావంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అవాక్కయ్యారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపించాయి. కర్నూలులో కొందరికి మెడల్స్‌కు బదులు కేవలం ప్రశంసా పత్రాలతోనే సరిపెట్టారని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరుత్సాహానికి గురయ్యారు. 
 
ఇక, ఈ యేడాది ఈ అవార్డులను ప్రభుత్వ, ఎయిడెడ్‌ విద్యాసంస్థల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. కాగా, ఇటీవల ఈ అవార్డులను వైఎస్సార్‌ ప్రతిభ అవార్డుగా పేరు మార్చి ఇవ్వాలని ప్రయత్నించగా, అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయమూ తెలిసిందే!  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు