వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో జగన్ సోదరి వైఎస్.షర్మిల పాత్ర కూడా ఉందన్నారు. వైసీపీ గెలుపు కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని, గొప్పగా ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని అన్నారు.
మరోవైపు, ఫిరాయింపు అంశంపై తమ ఎంపీలు న్యాయశాఖ మంత్రిని కలిశారని, ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని వారు మంత్రిని కోరారని తెలిపారు. కానీ, ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను తాను ఉల్లంఘించలేదని రఘురామ స్పష్టం చేశారు.
అటు, తమ ఎంపీలు హైకోర్టును కర్నూలుకు మార్చాలని కూడా మంత్రికి విన్నవించారని వివరించారు. అయితే, పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మార్చుతారా? అని రఘురామ ప్రశ్నించారు.
వైసీపీ సర్కారు తిరుమల శ్రీవారిని కూడా వదలడంలేదని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇకపై సాలీనా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్లో నిర్ణయించారని వెల్లడించారు.