జగన్‌కు ఓటేశాం... మా గ్రామానికేం చేశారు : తమ్మినేని సీతారాంకు ప్రశ్నల వర్షం

శనివారం, 26 ఆగస్టు 2023 (10:35 IST)
గత ఎన్నికల్లో తమ అభిమాన నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు అని భావించి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మా గ్రామానికి ఏం చేశారంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంను సొంత పార్టీ నేతలు, మద్దతుదారులు నిలదీశారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తమ్మినేని సీతారాం పారిపోయారు. 
 
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దళ్లపేట గ్రామంలో శుక్రవారం గడపగడపకూ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ బడే రఘురాం ఆధ్వర్యంలో పలువురు వైసీపీ మద్దతుదారులు స్పీకర్ వద్దకు వచ్చారు. వైసీపీకి ఓట్లు వేసి గెలిపించినా తమ గ్రామానికి ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా గ్రామంలో రోడ్లు, కాలువలు వేయలేదన్నారు. వీటిని ఎప్పుడు వేయిస్తారో చెప్పితీరాలని పట్టుబట్టారు. గ్రామ సమీపంలో కొండను కొంతమంది ఆక్రమించుకున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గ్రామంలో రోడ్ల పరిస్థితి చూడాలంటూ.. గుంతలు పడి నీరు నిలిచిన రోడ్డును చూపించారు. సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో తనకంతా తెలుసని, సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి స్పీకర్ అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా జారుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు