నెలాఖరులో చిరంజీవి తిరుపతి పర్యటన!

మంగళవారం, 26 మే 2009 (12:37 IST)
FileFILE
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నెలాఖరులో తన సొంత నియోజకవర్గమైన తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆయన సెగ్మెంట్‌లో పర్యటించాలని నిర్ణయించుకోవడం ఇదే తొలిసారి. ఇందుకోసం ఆయన ఈనెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

తొలుత 28వ తేదీన హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకునే ఆయన ముందుగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత, తిరుపతికి చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. పిమ్మట జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఇదేరోజు రాత్రి కొంతమంది ముఖ్య నేతలకు విందు ఇచ్చే అవకాశం ఉంది.

ఆ తర్వాత 29వ తేదీన తిరుపతి పట్టణంలో రోడ్‌షో నిర్వహిస్తారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై ప్రతినెలలో ఒకసారి తిరుపతిలో పర్యటించి, నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు.

అంతేకాకుండా, తాను అందుబాటులో లేని సమయంలో తన తరపున ఒకరిని ప్రతినిధిగా ఎంపిక చేసి, నియోజకవర్గ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి