కరోనా వైరస్ అప్‌డేట్: బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కోవిడ్-19

శుక్రవారం, 20 మార్చి 2020 (19:45 IST)
లక్నోలో శుక్రవారం నాడు నలుగురు వ్యక్తులు కరోనావైరస్ బారిన పడినట్లు నిర్థరణ అయింది. వారిలో బాలీవుడ్ గాయని కనికా కపూర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. కనికా మార్చి 9న లండన్ నుంచి వచ్చారు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయించుకున్నారు. అయితే, అప్పటికి కోవిడ్-19 లక్షణాలు బయట పడలేదని ఆమె చెప్పారు.

 
కనికా కపూర్ లక్నోలో రెండు మూడు పార్టీలలో పాల్గొని పాటలు పాడారు. ఆ వేడుకలకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆమెకు వైరస్ సోకిందని తేలడంతో నగరంలో భయాందోళనలు పెరిగాయి.

 
'నేను ఆ పార్టీకి హాజరయ్యాను' -వసుంధరా రాజె
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజె, తాను తన కుమారుడు దుష్యంత్, అతడి అత్తా మామలతో కలిసి కనికా కపూర్ పాల్గొన్న పార్టీకి వెళ్ళానని ట్వీట్ చేశారు. "దురదృష్టవశాత్తు కోవిడ్19 సోకిన కనికా కపూర్ పార్టీకి హాజరయ్యాం. దాంతో, నేను, నా కుమారుడు అప్రమత్తమయ్యాం. స్వీయ నిర్బంధంలో ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అని ఆమె ట్వీట్ చేశారు.

 
చండీగఢ్‌లో అయిదు కరోనా కేసులు
ఇదిలా ఉంటే,చండీగఢ్‌లో అయిదు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరు విదేశీ ప్రయాణాలు చేసిన వారు కాగా, మిగతా ముగ్గురికి స్థానికంగా వైరస్ సోకింది. హర్యానాలో అయిదుగురికి, పంజాబ్‌లో ముగ్గురికి వైరస్ నిర్థరణ అయిందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

 
'జనతా కర్ఫ్యూ పాటించండి... అప్రమత్తంగా ఉండండి' - తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం రాజ్‌భవన్‌లో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి కరోనావైరస్‌ను ఎదుర్కోవడం గురించి మాట్లాడారు. కరోనావైరస్ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, అయితే జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

 
స్వీయ సంరక్షణే అత్యుత్తమ సంరక్షణ అని, ప్రజుల ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లు అని చెప్పిన గవర్నర్, "కోవిడ్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలందరూ ఇళ్ళల్లో ఉంటే అందరికీ ఆరోగ్యకరం. తెలంగాణ రాజ్ భవన్ జనతా కర్ఫ్యూ పాటించేందుకు సిద్ధం అవుతోంది" అని అన్నారు. ఈ సందర్భంలో దేశంలోని యువత ఆరోగ్య రక్షణ కోసం యుద్ధం చేయాలని చెబుతూ వైరస్ నివారణ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు