సెమీఫైనల్లో భారత ప్రత్యర్థి ఎవరు - ఇంగ్లండా, న్యూజీలాండా?

గురువారం, 4 జులై 2019 (14:08 IST)
క్రికెట్ ప్రపంచ కప్‌ ట్రోఫీకి భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. భారత్ దాటాల్సిన మొదటి అడుగు సెమీఫైనల్. మరి సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ సేన ప్రత్యర్థి ఎవరు? పాయింట్ల పట్టికలో భారత్ ఒకటో స్థానానికి చేరుకుంటుందా, లేదా ఇప్పుడున్న రెండో స్థానానికే పరిమితమవుతుందా అనేదాన్ని బట్టి సెమీస్ ప్రత్యర్థి ఎవరనేది తేలుతుంది.

ఇది రెండు మ్యాచ్‌లపై ఆధారపడి ఉంటుంది. అవి- భారత్ వర్సెస్ శ్రీలంక, ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా. ఈ రెండు మ్యాచ్‌లు ఒకే రోజు జులై 6 శనివారం జరుగనున్నాయి.
 
పట్టికలో మొదటి స్థానం సాధించిన జట్టు నాలుగో స్థానంలోని జట్టుతో, రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలోని జట్టుతో సెమీఫైనల్స్ ఆడతాయి. జులై 3 బుధవారం నాటి న్యూజీలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితంతో సెమీస్ బెర్తులపై స్పష్టత వచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్(12 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుని సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా(14 పాయింట్లు), భారత్(13 పాయింట్లు) ఇంతకుముందే సెమీస్ చేరాయి.

 
పదకొండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజీలాండ్ కూడా సెమీస్ చేరడం ఖాయమైనట్లే. బుధవారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుతో పాకిస్తాన్, శ్రీలంక సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. తొమ్మిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు సాంకేతికంగా చూస్తే సెమీస్ అవకాశాలు కాస్తోకూస్తో ఉన్నాయి. కానీ అద్భుతాలు జరిగితే తప్ప న్యూజీలాండ్‌ను దాటి పాకిస్తాన్ సెమీస్‌కు చేరుకోలేదు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ నెగ్గినా, న్యూజీలాండ్‌ను పక్కకు నెట్టేసేంత నెట్ రన్‌రేట్ సాధించడం దాదాపు అసాధ్యం.

 
అన్ని మ్యాచ్‌లు ఆడేసిన న్యూజీలాండ్ నెట్ రన్‌రేట్ 0.175 కాగా, ఇంకో మ్యాచ్ ఆడాల్సిన పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ మైనస్ 0.792. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ నెగ్గినా, న్యూజీలాండ్‌ను పక్కకు నెట్టేసేంత నెట్ రన్‌రేట్ సాధించడం దాదాపు అసాధ్యం. టోర్నీలో మొత్తం పది జట్లు ఉండగా, ప్రతి జట్టు గరిష్ఠంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. సెమీస్ చేరిన జట్లలో ఆస్ట్రేలియా, భారత్ ఇంకా చెరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఫలితాలను బట్టి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం, రెండో స్థానం మారొచ్చు, మారకపోవచ్చు.

 
ఆస్ట్రేలియా చివరి లీగ్ మ్యాచ్‌ను మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నెగ్గితే 16 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.
 
జులై 3 నాటి ఇంగ్లండ్, న్యూజీలాండ్ మ్యాచ్ తర్వాత జట్ల స్థానాలు
భారత్ చివరి లీగ్ మ్యాచ్‌ను శ్రీలంకతో లీడ్స్‌లో హెడింగ్లే వేదికగా ఆడనుంది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, పాయింట్లు 15కు పెరుగుతాయి. అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ నెగ్గితే రెండు జట్లు వరుసగా 16, 15 పాయింట్లతో ఇప్పుడున్నట్లే తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయి. ఆస్ట్రేలియా, భారత్ రెండూ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయినా ఇప్పుడున్న స్థానాల్లోనే ఉంటాయి.

 
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయి, శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, భారత్ రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంటుంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచి, శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే భారత్ రెండో స్థానంలోనే ఉంటుంది. పాయింట్ల పట్టికలో న్యూజీలాండ్ నాలుగో స్థానంలో ఉంది.
 
వర్షం వల్ల రద్దయితే?
వర్షం లాంటి కారణాల వల్ల భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లు రద్దయినా పట్టికలో రెండు జట్లు ఇప్పుడున్న స్థానాల్లోనే ఉంటాయి. ఒకవేళ ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయి, శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే రెండు జట్ల పాయింట్లు సమానమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా నెట్‌రన్ రేట్ భారత్ కన్నా కాస్త మెరుగ్గా ఉంది. మొత్తమ్మీద భారత్ మొదటి స్థానానికి చేరుకుంటే సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ ప్రత్యర్థి అవుతుంది. భారత్ రెండో స్థానంలోనే ఉండిపోతే ఇంగ్లండ్ ప్రత్యర్థి అవుతుంది. ఆస్ట్రేలియా చివరి లీగ్ మ్యాచ్‌ను ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. టోర్నీలో లీగ్ దశలో న్యూజీలాండ్‌తో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

 
ఆ వేదికల్లో భారత్‌కు ఎదురైన ఫలితమేంటి?
భారత్ మొదటి స్థానానికి చేరుకుంటే- న్యూజీలాండ్ ప్రత్యర్థిగా జులై 9 మంగళవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌ వేదికగా సెమీఫైనల్ ఆడుతుంది. ఈ ప్రపంచ కప్‌లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ భారత్ ఘన విజయాలు సాధించింది. పాకిస్తాన్‌పై 89 పరుగుల తేడాతో, వెస్టిండీస్‌పై 125 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ రెండో స్థానానికి పరిమితమైతే- జులై 11 గురువారం బర్మింగ్‌హాంలోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. 

 
ఇప్పటివరకు భారత్ ఆడిన మ్యాచ్‌లు.. ఫలితాలు
జూన్ 5 భారత్ Vs దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలుపు
జూన్ 9 భారత్ Vs ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో భారత్ విజయం
జూన్ 13 భారత్ Vs న్యూజీలాండ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
జూన్ 16 భారత్ Vs పాకిస్తాన్ 89 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
జూన్ 22 భారత్ Vs అఫ్గానిస్తాన్ 11 పరుగుల తేడాతో భారత్ గెలుపు
జూన్ 27 భారత్ Vs వెస్టిండీస్ 125 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
జూన్ 30 భారత్ Vs ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం
జులై 2 భారత్ Vs బంగ్లాదేశ్ 28 పరుగుల తేడాతో భారత్ గెలుపు
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

 
టోర్నీలో ఇప్పటివరకు భారత్‌కు ఎదురైన ఏకైక పరాజయం ఇక్కడే నమోదైంది. ఇంగ్లండ్ చేతిలో 31 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఎడ్జ్‌బాస్టన్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు