వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే.. బొప్పాయి గుజ్జే?

మంగళవారం, 26 మార్చి 2019 (12:06 IST)
మనం తీసుకునే ఆహారం, లైఫ్‌స్టైల్, కాలుష్యం, ఎండ, మొబైల్ లేదా గాడ్జెట్స్ స్క్రీన్‌లకు ఎక్కువగా ప్రభావితమవడం వంటి అనేక కారణాల వలన మన చర్మం తరచుగా నల్లగా మారడం, పాడైపోవడం, మొటిమల బారిన పడడం, మృత కణాలు పేరుకుని పోవడం, డెడ్ స్కిన్, డార్క్ స్పాట్స్, చారలు, వృద్ధాప్య చాయలు, కంటి కింద వలయాలు, చర్మం ముడతలు పడడం జరుగుతుంది. వీటి నుండి బయటపడి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సౌందర్యాన్ని రక్షించడంలో బొప్పాయి పండు, కీరదోస ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
కీర దోసకాయలో ఉన్న హైడ్రేటింగ్ గుణాలు చర్మాన్ని పుష్టిపరచడంలో మరియు పాడైపోయిన చర్మాన్ని పునరుద్దరించడంలో ఉత్తమంగా సహాయపడతాయి. అలాగే కీరదోసలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంమీది ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. కీరదోసను తరచుగా ఉపయోగించినట్లయితే వృద్ధాప్య చాయల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. 
 
మొదటిగా సగం కీరదోసకాయను తీసుకుని తురమండి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కీరదోసకాయను అర కప్పు పెరుగు వేసి కలిపి ముఖానికి ప్యాక్‌గా వేసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
 
బొప్పాయి మరో చర్మ సంరక్షిణి. దీనిలో విటమిన్ ఎ, సి , ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, మృత చర్మ కణాలను తొలగించడంలో దోహదపడతాయి. ఇది పిగ్మెంటేషన్ మరియు నల్లమచ్చల చికిత్సలో కూడా సహాయపడుతుంది.
 
ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ముడి తేనె మరియు కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపండి. అన్నిటిని పూర్తిస్థాయిలో మిక్స్ చేసి మీ ముఖంపై అప్లై చేయాలి. ఇది డ్రై అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఉండనివ్వాలి. సాధారణ నీటిని ఉపయోగించి దీనిని శుభ్రం చేయవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు