అలా వదిలేస్తే కేశాలు నిర్జీవంగా మారిపోతాయ్ జాగ్రత్త...

శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (21:03 IST)
జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే ఎగ్ మిక్సింగ్ షాంపూలను ఎంచుకోవాలి. కనీసం రెండు రోజులకోసారి తలస్నానం చేయాలి. జుట్టు మరీ జిడ్డుగా ఉంటే షాంపూ చేసుకోవడానికి ముందు నిమ్మరసాన్ని పట్టించాలి. గంట తర్వాత గోరు నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఆలివ్ ఆయిల్ రాసి తలస్నానం చేస్తే మంచిది. పొడిబారినట్లుగా అనిపిస్తే అలో జెల్‌తో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి.
 
ఎండిన ఉసిరికాయ పొడిలో, ఒక స్పూన్ గోరింటాకు పొడి, మెంతులపొడిని కలపండి. ఈ పొడిలో రెండు స్పూన్ల కొబ్బరి పాలు కలిపి జుట్టుకు పట్టించి ఒక గంటపాటు ఉంచండి. తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లటి, దట్టమైన శిరోజాలు మీ సొంతం.
 
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత రెండు స్పూన్ల వెనిగర్ తీసుకొని తలకి బాగా పట్టించి కడిగేయాలి. ఇలా చేస్తే వెంట్రుకలు నిగనిగలాడుతూ కనిపిస్తాయి. చుండ్రుతో ఇబ్బందిపడేవారు రాత్రి పడుకునే సమయంలో రెండు టీ స్పూన్ల వెనిగర్‌లో ఆరు టీ స్పూన్ల నీళ్లు కలిపి కుదుళ్లకు పట్టించి తలకు టవల్ చుట్టుకోవాలి. 
 
ఉదయం మరోసారి చేసి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. మందారపువ్వును పేస్ట్‌లా చేసి ఆ రసాన్ని జుట్టంతా పట్టించి తలస్నానం చేస్తే జుట్టు కాంతులీనుతుంది. లేకపోతే మందార ఆకుల్ని పొడికొట్టి అందులో పెరుగు కలిపి తలకు పట్టించినా ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి