బొప్పాయి పండుతో ముఖానికి మాస్క్ వేసుకున్నట్లయితే...?

సోమవారం, 14 జనవరి 2019 (14:51 IST)
బొప్పాయి పండు ఆరోగ్యానికే కాకుండా, చర్మం సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో లభించే విటమిన్స్ నిర్జీవమైన చర్మాన్ని తొలగించి, కొత్త చర్మం ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. బొప్పాయి పండుకు రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉండడంతో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
 
గరుకు చర్మంతో ఇబ్బందిపడేవారికి బొప్పాయి పండు చక్కగా పనిచేస్తుంది. గరుకు చర్మాన్ని మృదువుగా మార్చే గుణం బొప్పాయికి మెండుగా ఉంది. బొప్పాయి తొక్కలను ఓ గిన్నెలో వేసి ఉడికించి, వాటిని మెత్తగా నూరి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేసినట్లైతే ముఖం కోమలంగా మారుతుంది.
 
బొప్పాయి పండుతో ముఖానికి మాస్క్ వేసుకున్నట్లయితే ముఖంపై ఉండే మృతుకణాలు తొలగిపోయి, చర్మం చాలా తేటగా మారుతుంది. అర టీస్పూన్ ముల్తానీ మట్టికి మరో స్పూన్ బొప్పాయి గుజ్జును కలిపి ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేశాక.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించటంలో బొప్పాయి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓ స్పూన్ కలబంద గుజ్జు, స్పూన్ బొప్పాయి గుజ్జు తీసుకుని ముఖానికి పట్టించి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. అయితే ఇది కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి. నానబెట్టిన ఎండుద్రాక్షలతోపాటు బొప్పాయి పండును నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు