ది డెత్ ఆఫ్ ది లాస్ట్ ఇండియన్

Raju

శనివారం, 6 సెప్టెంబరు 2008 (20:56 IST)
ప్రాంతీయ భాషల్లో ప్రామాణిక భాషలో రచనలు సాగుతున్నప్పటికీ, ఆయా ప్రాంతాల మాండలికాలలో రచనలు చేయడం కొత్త విషయమేమీ కాదు. అయితే గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన రచయిత చిత్తూరుకు వలస వెళ్లి అక్కడి మట్టివానసలు పీలుస్తూ అక్కడి భాషను ఔపోసన పట్టడం అంటే మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యమయ్యేదీ కాదు.

జొన్నవిత్తుల రామచంద్రమూర్తి సరిగ్గా ఈ పనే చేశారు. జీవిత గమనంలో తను రాసిన 28 కథల్లోంచి 16 కథలను మాత్రం తీసుకుని ది డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ పేరిట సంకలనం చేసిన మూర్తి చిత్తూరు మాండలికాన్ని తన స్వంత భాషగా చేసుకుని అద్భుతం సృష్టించారు. నిజం చెప్పాలంటే ఈ 16 కథలూ జవజీవాలు ఉట్టిపడే పదహారణాల తెలుగు కథలు

తన చుట్టూ ఉన్న జీవితాలను ఎన్నో కోణాల నుంచి పరిశీలించే తత్వం మూర్తిగారిది. కేవలం స్త్రీ సమస్యలే కాకుండా దళిత సమస్యలు, రైతు సమస్యలు, రాజకీయ కుళ్లు, కులహంకారాలు ఇలా ఇవన్నీ మూర్తి గారి కథలకు వస్తువులయ్యాయి. ప్రతి కథకూ ముందు ఆ కథ గురించి మధురాంతకం నరేంద్ర, పలమనేరు బాలాజీలు చక్కటి అవగాహనతో నాలుగు మాటలు రాయటం తెలుగులో పుస్తక పరిచయానికి సంబంధించి కొత్త ప్రక్రియగా నిలుస్తుంది.

చిత్తూరు జిల్లా ప్రజల ఉచ్ఛారణను పొల్లు పోకుండా తన కథల్లోకి తీసుకురాగలగడమంటే అక్కడి భాష పట్ల, ఆ ప్రజల పట్ల ఎంతో మమకారం ఉంటే తప్ప అసాధ్యం. ఈ అసాథ్యాన్ని ఈ పుస్తక రచయిత సుసాధ్యం చేసి చూపారు.

దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆంధ్రప్రభలో వచ్చిన "వంజె" కథ తెలుగు పాఠకలోకాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఒక స్త్రీ జీవితంలోకి రచయిత పరకాయప్రవేశం చేసి ఆమె మానసిక సంఘర్షణను పాఠకలోకం ఒళ్లు గగుర్పొడిచేలా చెప్పి సంచలనం రేకెత్తించారు. భార్య సంతానాన్ని ఎవరి ద్వారా కన్నా ఫర్వాలేదు.. తను మాత్రం పదిమందిలో మగాడిలా తలెత్తుకు తిరిగితే చాలు అనుకునే ఓ విద్యావంతుడి కుసంస్కారాన్ని వంజె కథలో రచయిత కుదిపి కుదిపి మరీ చెప్పాడు.

ఈ కథ ఆ గోదావరబ్బాయి రాసినదే మరి. వంజె అంటే గొడ్రాలు అనే అర్థం వేరే ప్రాంతాల వారికీ అప్పుడే తెలిసింది మరి.

రాష్ట్రంలోని అన్ని పుస్తకాల షాపుల్లో ఈ కథల సంకలనం లభ్యమవుతుంది. పేజీలు 190 వెల రూ.90లు.

చిత్తూరు జిల్లా మాండలికాల మట్టివాసన చూడాలంటే తప్పక ఈ పుస్తకం కొని చదవాల్సిందే.

వెబ్దునియా పై చదవండి