నీలగిరి పర్వత రైల్వేపై పుస్తకావిష్కరణ

మంగళవారం, 14 అక్టోబరు 2008 (17:43 IST)
FileFILE
నీలగిరి పర్వత రైల్వేపై రాసిన హెరిటేజ్ ఎక్స్‌ప్రెస్ పుస్తకాన్ని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఆర్ వేలు ఉదకమండలంలో ఆవిష్కరించారు. సోమవారం ఊటీలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో మంత్రి పాల్గొన్నారు. నీలగిరి పర్వత రైల్వేను దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక రైల్వేలలో ఒకటిగా తాము పరిగణిస్తున్నామని వేలు చెప్పారు.

1960ల చివర్లో కొన్ని సంవత్సరాల పాటు నీలగిరితో తనకు అనుబంధం ఏర్పడినందున ఈ ప్రాంత అభివృద్ధిపై తనకు వ్యక్తిగత ఆసక్తి ఉందని మంత్రి చెప్పారు. నీలగిరి రైల్వే మార్గంలో అరువన్‌రాడు, కెట్టి స్టేషన్లలో టికెట్ కోటాలను రద్దు చేయడాన్ని విలేఖరులు ప్రస్తావించినపుడు ఈ రెండు స్టేషన్లలో టికెట్ కోటాను పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు హెరిటేజ్ స్టీమ్ చారియట్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కె నటరాజన్ ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో చూపిన కృషిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

పిల్లలు నీలగిరి మౌంటెయిన్ రైల్వే రాయబారులుగా వ్యవహరించగలరని సహాయ మంత్రి వేలు ఆశాభావం వ్యక్తపరిచారు. అణు ఇంధన సంస్థ మాజీ ఛైర్మన్ ఎంఆర్ శ్రీనివాసన్ "హెరిటేజ్ ఎక్స్‌ప్రెస్" పుస్తకం తొలి కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిల్ స్టేషన్ ప్రాంత ప్రజలు సంవత్సరాల తరబడి ఈ రైల్వే మార్గాన్ని పోషిస్తూ వస్తున్నప్పటికీ నీలగిరి రైలు మార్గ పరిరక్షణకు పుస్తక రచయిచ శ్రీనివాసన్ కంకణ బద్ధులయ్యారని తెలిపారు.

నీలగిరి పర్వత రైల్వే గురించిన అమూల్యమైన సమాచారాన్ని ఈ పుస్తకం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపి ఎం మాస్టర్ మథాన్ మాట్లాడుతూ హిల్ స్టేషన్లను అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలపాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ పర్వత మార్గంలోని రున్నీమేడ్ ఏరియాను వృద్ధి చేయాలని నటరాజన్ పిలుపునిచ్చారు.

ఈ రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలను సుందరీకరించాలని ఊటకముండ్ సిటిజన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్‌కె సెల్వరాజ్ కోరారు. ట్రస్టు అధ్యక్షుడు డి కృష్ణరాజ్, ఉదకమండలం పురపాలకమండలి ఛైర్మన్ కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి