విజయవాడలో "పుస్తక మహోత్సవం"

సోమవారం, 5 జనవరి 2009 (19:42 IST)
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో పదకొండు రోజులపాటు జరుగనున్న 20వ పుస్తక మహోత్సవం.. స్థానిక స్వరాజ్య మైదానంలో నూతన సంవత్సరం రోజున ఘనంగా ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంటర్ గుడ్ గవర్నెస్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఇదిలా ఉంటే... ఈ వేడుకల్లో భాగంగా... మొత్తం 270 బుక్‌ స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పలు భాషలకు చెందిన పుస్తకాలు ఈ స్టాళ్లలో కొలువు తీరగా... తొలిరోజే సుమారు 25వేల మంది పుస్తకప్రియులు వీటిని సందర్శించారు. కాగా, పుస్తకాలను చూసేందుకు వచ్చే పుస్తక ప్రేమికులకు ప్రవేశ రుసుం లాంటివేమీ లేవు. అంతేగాకుండా.. పుస్తకాల కొనుగోలుపై పదిశాతం రాయితీని కూడా ఇస్తున్నారు.

పుస్తక మహోత్సవంలో ఈసారి థీమ్ పెవిలియన్‌ను కూడా ప్రారంభించారు. "అనువాదంతో అనుసంధానం" పేరుతో శుక్రవారం ఓ చర్చా వేదికను కూడా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పేరొందిన సుమారు 20మంది రచయితలు, అనువాదకులు ఈ చర్చావేదికలో పాల్గొంటున్నారు.

ఇంకా ఈ పుస్తక మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్, సాహిత్య అకాడమీ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి, మేయర్ రత్నబిందు, సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ కుమార్, రామ్ కుమార్ తదితరులు విచ్చేశారు.

వెబ్దునియా పై చదవండి