సంగీత త్రిమూర్తుల పుస్తకాల పరిచయం

బుధవారం, 24 సెప్టెంబరు 2008 (15:40 IST)
కర్నాటక సంగీతానికి త్రిమూర్తులుగా సుప్రసిద్ధులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి త్రయం రచించిన కృతుల గురించి ప్రముఖ సంగీత విమర్శకుడు వీఎస్‌వి రచించిన మూడు పుస్తకాల పరిచయం కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. సోమవారం రాత్రి నగరంలోని బ్రహ్మ గానసభ అధ్వర్యలో ఏర్పాటైన ఈ పుస్తక పరిచయ కార్యక్రమం సభకు విచ్చేసిన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చెన్నై తమిళిసై సంఘ అధ్యక్షుడు, గుజరాత్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పీఆర్ గోపాలకృష్ణన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కావేరీ తీరంలో 18వ శతాబ్దంలో నివసించిన దక్షిణాది సంగీత త్రిమూర్తుల కృతులలోని భక్తిరసం అమూల్యమని చెప్పారు. కృతుల రచన సమయ సందర్భాలను గురించి వీఎస్వీ తమ పుస్తకాలలో వివరించిన తీరును గోపాల కృష్ణన్ కొనియాడారు.

సంగీత కృతులను గానం చేస్తున్నవారు వాటి వివరాలను తెలుసుకుంటే సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా అనువదించగలరని తెలిపారు. ఇవి పది కాలాల పాటు ప్రతి ఒక్కరూ పదిలంగా దాచుకోవలసిన పుస్తకాలని చెప్పారు.

ఈ సందర్భంగా ప్రముఖ గాయని సుధా రఘునాథన్ మాట్లాడుతూ, సంగీతకారులకే కాక సంగీతాభిమానులకు కూడా వీఎస్వీ పుస్తకాలు ఎంతో ఉపయోగకారిగా ఉన్నాయని ప్రశంసించారు. ననుపాలింపగ నడచి వచ్చితివా... -త్యాగరాజు-, ఆనందామృత వర్షిణి -ముత్తుస్వామి దీక్షితులు- రచించిన కృతులను ఆమె గానం చేసి సభికులను రంజింపజేశారు.

చివరలో రచయిత వీఎస్వీ తన పుస్తకాల పరిచయ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన పుస్తకాలుకు పీఠికలు రాసిన కళాకారులకు, ముద్రాపకులకు, సభకు పుస్తకాలు పరిచయం చేసిన ప్రముఖ కళాపోషకులు నల్లి కుప్పుస్వామి చెట్టికి ధన్యవాదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి