సిమెంట్ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం నిలకడగా సాగుతుందని సిమెంట్ ఉత్పత్తిదారుల అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ ఏడాది అదనంగా మరో 50 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలుపుకుని నిలకడగా ముందుకు సాగుతుందని సీఎంఏ విశ్వాసం వ్యక్తం చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గినా సిమెంట్ రంగం 9 నుంచి 10 శాతం వృద్ధిని సాధించే అవకాశం ఉందని హైదరాబాద్లో జరిగిన గ్రీన్ సిమెంటెక్ -2009 సదస్సులో పాల్గొన్న సీఎంఏ అధ్యక్షుడు ప్రెసిడెంట్ హెచ్ఎం భంగూర్ అన్నారు.
భారత సిమెంట్ కంపెనీలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దటంపై చర్చించటానికి రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, హౌసింగ్ రంగంలో నెలకొన్న స్తబ్దత ఎక్కువ కాలం నిలబడదని, ఇప్పటికే సిమెంట్కు భారీగా డిమాండ్ ఉందని, అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక వసతుల రంగం వృద్ధికి తీసుకునే చర్యలపై ఆధారపడి ఇది మరింతగా పెరగవచ్చని ఆయన తెలిపారు.