ఆటో ఎగుమతి రంగంలో భారత్ అగ్రగామి

దేశీయ ఆటో మొబైల్స్ ఎగుమతి రంగంలో అగ్రగామిగా ఉన్న చైనా దేశాన్ని భారతదేశం అధిగమిస్తోంది.

ఆటోమొబైల్స్ రంగంలో విదేశాలకు ఎగుమతులు చేసే విషయంలో అగ్రగామిగానున్న చైనాను భారతదేశం అధిగమిస్తోంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి జులై వరకు భారత్ దాదాపు 2.30 లక్షల కార్లు, వ్యాన్లు, ట్రక్కులను భారత్ ఎగుమతి చేసినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.

గతంలో అమెరికా దేశం తన ఆటో ఉత్పత్తులను ఎగుమతి చేసే విషయంలో ముందుండేది. దానిని చైనా దేశం అధిగమించింది. అమెరికాకంటే ఆటో ఎగుమతుల రంగంలో చైనా ముందుంది.

ప్రస్తుతం భారత దేశంలో చిన్న కార్ల తయారీ పెరగడంతో ఎగుమతుల్లో ఆధిక్యం పెంచుకుంది. దీంతో చైనా రెండవ స్థానానికి చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా ఇతర దేశాల ఎగుమతులు తగ్గిపోగా భారతదేశం మాత్రం ఆటో ఎగుమతులను వృద్ధి చేసుకుంది.

అదే చైనాలో పెద్ద కార్ల మార్కెట్ మాంద్యం కారణంగా మందగించింది. దీంతో అక్కడి దిగుమతులన్నీ మందగించాయి. అందునా చైనాలో కార్ల కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటే స్థానికులతో కలిసి మాత్రమే వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అదే భారతదేశంలో పరిస్థితి అలా కాదు.

భారతదేశంలో విదేశీ వ్యాపారస్థులు పెట్టుబడి పెట్టాలంటే వందశాతం పెట్టుబడులు పెట్టి భారత ప్రభుత్వానికి పన్నులు చెల్లించి మిగిలిన లాభాలు వారే తీసుకునే వీలుంది. కాబట్టి విదేశీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపిస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి