కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఎగుమతిదారులు చెల్లించాల్సిన వడ్డీలో రెండు శాతం రాయితీ ఇస్తూ ప్రకటించింది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి వరకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పలు ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రకటించింది. అందులో భాగంగా ఎగుమతి దారులు తీసుకునే రుణాలపై రెండు శాతం రాయితీని మరో ఏడాదిపాటు పొడిగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం లోక్సభలో ప్రకటించారు. ఎగుమతి చేసే వస్తువుల్లో హస్తకళలు, కార్పేట్లు, హ్యాండ్లూమ్, చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంఈ) ఎగుమతి చేసే వస్తువులపై ఈ రాయితీ ఉంటుందని ఆయన అన్నారు.
గతంలో ప్రకటించిన బడ్జెట్ మేరకు వాటి సమయం ఈ ఏడాది మార్చి 31 నాటికి ముగుస్తుంది. పైన తెలిపిన పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతుల్లో తగ్గుదల నమోదు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్టోబరు 2008 నుంచి ఎగుమతుల్లో తగ్గుదల నమోదు చేసుకుంది. దీంతో ఈ రంగాలలోని పరిశ్రమలు మాంద్యం దెబ్బతో కొట్టుమిట్టాడాయి. 13 నెలల తర్వాత నిరుడు నవంబరులో ఎగుమతుల్లో వృద్ధి సాధించి 18.2 శాతానికి చేరుకుంది. దీంతో దేశీయ ఉత్పత్తుల ఎగుమతిదారులకు ఊరట కలిగింది. అదే నిరుడు డిసెంబరులో 9.3 శాతం మేరకు ఎగుమతులు జరిగాయి.
ఇదిలావుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో దేశీయ ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి చెంది 88 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారం జరుగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి (పిఎంఈఏసీ) అభిప్రాయడింది. కాగా ఇదే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 81 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు జరిగినట్లు దేశీయ ఎగుమతిదారులు తెలిపారు.