ఈ ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఎగుమతులు దిగుమతులు తగ్గాయి. జనవరి నెలలో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనంతో దేశీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఎగుమతులు జనవరి నెలకు గాను 15.9 శాతానికి, దిగుమతులు 18.2 శాతానికి క్షీణించాయి. ఎగుమతులు 16 శాతం దిగువకు చేరటం మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్కి చెందిన ఎ.శక్తివేల్ అన్నారు.
ఎగుమతులు గత ఏడాది జనవరిలో 14.71 బిలియన్ డాలర్లు ఉండగా ఈ ఏడాది ఇదే నెలలో ఇది 12.38 బిలియన్ డాలర్లకు తగ్గింది. అలాగే దిగుమతులు 22.56 బిలియన్ల నుంచి 18.45 బిలియన్లకు క్షీణించాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంతోనే ఎగుమతులు, దిగుమతులు తగ్గాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త డి.కె.జోషి అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కట్లలో దేశీయ వస్తువులకు డిమాండ్, ధరలు తగ్గాయని చెప్పారు.