సిఎన్జీ గ్యాస్ ధర పెంపు: రూ.21.70కు చేరిన సిలిండర్!
శనివారం, 20 మార్చి 2010 (15:56 IST)
దేశంలో పెట్రోలు, డీజల్, కిరోసిన్ ధరలు పెరిగిన వారం రోజులకు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సరఫరా చేసే సీఎన్జీ గ్యాస్ ధరను కూడా పెంచింది. ఒక కేజీ గ్యాస్పై యాభై పైసలు చొప్పున పెంచినట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ రాజేష్ వేదవ్యాస్ తెలిపారు. ఈ పెంచిన ధరలు శనివారం అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయని వెల్లడించారు.
పెంచిన సీఎన్జీ ధరలు ప్రతి కిలో గ్యాస్ ధరపై 50 పైసలు పెంచడంతో సిలిండరు ధర రూ.21.70 పైసలకు చేరుకుంది. ఇలాపెంచడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. సిఎన్జీ గ్యాస్ ద్వారా నడిచే వాహనాలు పెట్రో ధరలకన్నా సుమారు 70 శాతం తక్కువ ధరలకే గ్యాస్ లభ్యమౌతుందని ఐజీఎల్ వర్గాలు తెలిపాయి.
పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు కేవలం ఢిల్లీతో పాటు.. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాలకు వర్తిస్తాయి. కొత్త ధరల ప్రకారం ఒక సీఎన్జీ గ్యాస్ కేజీ ధర ఢిల్లీలో రూ.21.70 గాను, నోయిడా, గ్రేటర్ నోయిడాలో రూ.23.50 గాను, గ్రేటర్ నోయిడాలలో రూ.25.50 పైసలకు చేరుకుంటుంది.
ఆయిల్ కంపెనీలు పెట్రో ధరలు పెంచిన వారం రోజులకు సీఎన్జీ ధరలు పెరగడం గమనార్హం. కాగా, పెట్రో ధరను ఒక లీటరుకు రూ.2.71 పైసలు, లీటరు డీజల్ ధరను రూ.2.55 పైసలు చొప్పున పెంచిన విషయం తెల్సిందే.
కాగా, కేవలం ఢిల్లీలోనే 2,50,000 వాహనాలు ఉన్నాయి. వీటిలో 1,40,000 కార్లు సీఎన్జీ గ్యాస్తో నడుస్తున్నాయి. వీటితో పాటు.. ఆటో రిక్షాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ కూడా సీఎన్జీ గ్యాస్పైనే నడుస్తున్నాయి.
గెయిల్ ఇండియా లిమిటెడ్, బీసీసీఎల్, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ ప్రభుత్వ సంయుక్త సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) కావడం గమనార్హం. దీనిపై ఐజీఎల్ మేనేజింగ్ డైరక్టర్ రాజేష్ వేదవ్యాస్ మాట్లాడుతూ.. గ్యాస్ ధర పెంపు కేవలం రెండు శాతమేనన్నారు. పెట్రో, డీజల్ ధరలతో పోల్చుకుంటే సీఎన్జీ వినియోగదారులకు 67 శాతం మేరకు ఆదా అవుతుందని ఆయన వివరించారు.