చికెన్‌కు భలే డిమాండ్.. రూ.180వరకు పెరిగిన ధర

బుధవారం, 9 జూన్ 2021 (12:51 IST)
వేసవికాలం, కరోనా కారణంగా రెండు నెలలుగా చికెన్‌ అమ్మకాలు తగ్గాయి. దీంతో మార్చిలో కిలో రూ.200దాకా అమ్మిన స్కిన్‌లెన్ చికెన్‌ ధర రూ.50-60 దాకా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టడం, వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో చికెన్‌ వినియోగం మళ్లీ పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం కిలో రూ.140నుంచి రూ.180కి పెరిగింది. 
 
అయితే డిమాండ్‌కు తగ్గ చికెన్‌ ఉత్పత్తి లేకపోవడంతో వ్యాపారులు ధర అమాంతం పెంచేశారు. తొలకరి తర్వాత కొత్త బ్యాచ్‌లను పౌల్ట్రీ యజమానులు తెస్తుంటారు. దీంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కొరవడింది. అదే సమయంలో ఏప్రిల్‌, మే నెలల్లో సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడిన చాలా మంది నెలరోజుల పాటు చికెన్‌ తీసుకోలేదు. ఇప్పుడు పౌష్టికాహారం కోసం అనేక మంది చికెన్‌ను ఓ పట్టుపడుతున్నారు. దీంతో మూడు రోజులు క్రితం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో బాయిలర్‌ కోడి మాంసం కిలో(ఫాం గేట్‌) రేటు రూ.85-87ఉండగా.. ఇప్పుడు రూ.100 దాటేసింది. 
 
ప్రాసెసింగ్‌, ఇతర ఖర్చులు కలుపుకొని వ్యాపారులు కిలో స్కిన్‌లెస్ చికెన్‌ రూ.180 అమ్ముతున్నారు. మరోవైపు గుడ్డు ధర కూడా భారీగా పెరిగింది. రిటైల్‌గా ఒక్కో గుడ్డును రూ.7-8వరకు అమ్ముతున్నారు. పౌల్ర్టీలకు కొత్త బ్యాచ్‌లు వచ్చే వరకు గుడ్లు, చికెన్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు