చైనాకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్ : స్టాక్ ఎక్స్చేంజ్‌ల నుంచి కంపెనీల డీలిస్ట్

ఆదివారం, 20 డిశెంబరు 2020 (11:46 IST)
డ్రాగన్ కంట్రీ చైనాకు అగ్రరాజ్యం అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అమెరికా కంపెనీలను డీలిస్ట్ చేసింది. ఫలితంగా అమెరికా, చైనాల దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. 
 
నిజానికి ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో వాణిజ్య యుద్ధం సాగుతోంది. ఇది మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. గతంలోనే చైనాకు చెందిన పలు కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించగా.. తాజాగా స్టాక్ ఎక్స్చేంజీల నుంచి చైనా కంపెనీలను తొలగించే చట్టంపై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ సంతకం చేశారు. దీంతో అమెరికా ఆడిటింగ్‌ ప్రమాణాలకు కట్టుబడి ఉండకపోతే చైనా కంపెనీలను యూఎస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డిలీట్‌ చేసే అవకాశం ఉంది. 
 
'ది హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్' వరుసగా మూడు సంవత్సరాలు యూఎస్‌ పబ్లిక్ అకౌంటింగ్ పర్యవేక్షణ బోర్డు ఆడిట్‌లను పాటించడంలో విఫలమైతే విదేశీ కంపెనీల సెక్యూరిటీలను అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలో జాబితా చేయకుండా నిషేధం విధిస్తుంది. ఈ బిల్లు ప్రకారం లిస్టెడ్‌ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
 
అంతేకాకుండా అమెరికాలో పబ్లిక్‌ కంపెనీల ఖాతాలు సమీక్షించే బోర్డు తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తిస్తుంది. అయితే ఆడిటింగ్‌ విషయంలో చైనా కంపెనీలు అమెరికాతో సహకరించకపోవడంతో అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకువచ్చింది. 
 
తాజాచట్టం.. దిగ్గజ కంపెనీలైన అలీబాబా గ్రూప్‌, బైడు, టెక్‌ సంస్థ పిండుడువో ఇంక్‌, చమురు దిగ్గజం పెట్రో చైనా కో.లిమిటెడ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి చైనాపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిలో వెలుగులోకి వచ్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీపై విమర్శలు మరింత తీవ్రం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు