ఆంధ్రప్రదేశ్లో ఇన్ ఫోకస్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటు ఏర్పాటు కానుంది. అమెరికా కేంద్రంగా స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, అల్ట్రా హై డెఫినిషన్ (యుహెచ్డి) టీవీలను మార్కెటింగ్ చేస్తున్న ఇన్ ఫోకస్ ఏపీలోని ఫాక్స్ కాన్ సెంటర్లో స్మార్ట్ ఫోన్లను సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ భారత హెడ్ సచిన్ థాపర్ వివరించారు. ఏపీ నుంచి ఎగుమతులు కూడా జరుపనున్నట్లు సచిన్ థాపర్ పేర్కొన్నారు.
త్రీడి కంటెంట్ను ప్రత్యక్షంగా వీక్షించేలా కొత్తగా, ఎం550-3డి స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చామని, దీనితో త్రీడి చిత్రాలను కూడా తీయవచ్చని, దీని ధర రూ. 15,999 పలుకుతుందని సచిన్ థాపర్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల కాలంలో మార్కెటింగ్ కోసం రూ. 190 కోట్లను కేటాయించినట్టు తెలిపారు.
తమ సంస్థ మార్కెటింగ్ చేస్తున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్లనూ ఏపీలో తయారు చేస్తామని, మార్చి 2016 నాటికి 50లక్షల స్మార్ట్ ఫోన్లను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. మరో సంవత్సరం వ్యవధిలో భారత మార్కెట్ నుంచి 100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 6,300 కోట్లు) ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్టు సచిన్ తెలియజేశారు.