దేశంలో ఉల్లి ధరలు చౌకగా ఉన్నాయి : కేంద్రం

గురువారం, 4 నవంబరు 2021 (19:02 IST)
గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది ఉల్లిపాయల ధరలు చాలా చౌకగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. అయినప్పటికీ ధరలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ఉల్లిగడ్డలు ఆల్‌ ఇండియా రిటైల్‌, హోల్‌సెల్‌ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ.40.13 ఉందని, క్వింటాల్‌కు రూ.3215.92 ధర పలుకుతోందని పేర్కొంది. వాస్తవానికి భారీ వర్షాల కారణంగా అక్టోబరు మొదటివారం నుంచి ఉల్లిపాయల ధరలు పెరగడం ప్రారంభించాయని.. ధరలను తగ్గించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిందని తెలిపింది. 
 
ఇందులో భాగంగా అడిగిన వారికి అడిగినట్లుగా బఫర్‌ నిల్వల నుంచి ఉల్లి సరఫరా చేశామని, దీంతో ధరలు దిగివచ్చాయని పేర్కొంది. నవంబరు 2 వరకు హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, పట్నా, రాంచీ, గువాహటి, భువనేశ్వర్‌, బెంగళూరు, చెన్నై, ముంబై, ఛండీగఢ్‌, కోచి, రాయ్‌పుర్‌లాంటి ప్రధాన మార్కెట్లకు 1,11,376.17 మెట్రిక్‌ టన్నుల ఉల్లి సరఫరా చేశామని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ల్లోని స్థానిక మార్కెట్లకూ అందించినట్లు చెప్పింది.
 
వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు రూ.21కే కిలో ఇవ్వడానికి సిద్ధమైందని, రిటైల్‌ మార్కెట్‌ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రవాణా ఖర్చులతో కలిపితే వచ్చే ధరకు (ల్యాండెడ్‌ ప్రైస్‌-వాస్తవ ధర) ఉల్లి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంది. ధరల స్థిరీకరణ నిధితో వినియోగ వ్యవహారాల శాఖ బఫర్‌ నిల్వలు నిర్వహిస్తోందని కేంద్రం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు