బ్యాంకుల తీరుపై ప్రజాగ్రహం.. వేతన ఖాతాలు ఖాళీ చేస్తాం .. ఏప్రిల్‌ 6న నో ట్రాన్సాక్షన్‌ డే

మంగళవారం, 7 మార్చి 2017 (10:39 IST)
లోగడ పిచ్చి తుగ్లక్ పాలనలో "జుట్టు పెంచితే పన్ను.. జుట్టు గొరిగితే పన్ను"ను వసూలు చేసేవారు. ఇపుడు మన జాతీయ బ్యాంకుల పరిస్థితి దీనికి ఏమాత్రం తీసిపోవడం లేదు. అకౌంట్లో డబ్బులు వేసినా పన్ను.. డబ్బు తీసినా పన్ను! పోనీ కార్డులు వాడదామా అంటే.. పరిమితి మించి డ్రా చేస్తే వాటిపైనా పన్ను!! ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేద్దామంటే.. ఆ లావాదేవీలపైనా పన్ను!!! ప్రైవేట్ బ్యాంకులు చార్జీలు పెంచినప్పుడు పెద్దగా పట్టించుకోని ఖాతాదారులు, జాతీయ బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పేదలు, మధ్యతరగతి వారి ఖాతాలు ఎక్కువగా ఉండే ఎస్‌బీఐ వంటి జాతీయ బ్యాంకుల్లోనే. నగరాల్లో కనీస నిల్వ రూ.5000 ఉంచాలనడం ఘోరమని ప్రతి ఒక్కరూ అంటున్నారు. నెలకు 3 లావాదేవీలు తదితర నిబంధనలపైనా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పైకేమో నగదు లావాదేవీలను తగ్గించడానికే ఈ నిర్ణయమని బ్యాంకులు పేర్కొంటున్నప్పటికీ... అంతిమంగా వాటి నుంచి లాభాలు పిండుకోవడమే బ్యాంకుల లక్ష్యం అని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
 
ఎస్.బి.ఐ చర్యకు నిరసనగా 'బ్యాంకులు లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. లావాదేవీల ఫీజులను పెంచుతున్నాయి. మనం అన్నిటికీ పన్ను కట్టాల్సి వస్తోంది. సంపాదించినా పన్ను.. ఖర్చుపెట్టినా పన్ను.. డిపాజిట్‌ చేసినా పన్ను.. మన డబ్బు మనం విత డ్రా చేసినా పన్ను! రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వడం తప్ప ఇంక ఏ పనిచేసినా పన్ను వేస్తున్నారు. కాబట్టి బ్యాంకులకు ప్రజల శక్తి ఏమిటో చూపిద్దాం. అందరం కలిసికట్టుగా నిలబడి.. ఏప్రిల్‌ 6ను 'నో (బ్యాంక్‌) ట్రాన్సాక్షన్‌ డే'గా పాటిద్దాం' అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విస్తృత ప్రచారం సాగుతోంది. 

వెబ్దునియా పై చదవండి