మహిళా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తాం: మంత్రి సబిత

సోమవారం, 8 మార్చి 2010 (18:41 IST)
FILE
రానున్న రోజుల్లో రాష్ట్రంలో దాదాపు రెండు వేలమంది మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సోమవారం రాష్ట్ర హోం శాఖామంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు.

రాష్ట్ర రాజధాని సమీపంలోనున్న బేగంపేటలోని మహిళా పోలీస్ స్టేషన్‌ను హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం మంత్రి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో మహిళా పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నామన్నారు.

దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేస్తామని, నోటిఫికేషన్‌కు సంబంధించి తమ శాఖాధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా దాదాపు రెండు వేలమంది మహిళలకు తమ ప్రభుత్వం పోలీసు శాఖలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు.

రాష్ట్రంలోని మహిళా పోలీసులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌ను ఆమె తనిఖీ చేసినప్పుడు ఆమెవెంట పోలీస్ కమిషనర్ ఏ.కె.ఖాన్ కూడా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి