సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు - 99.37 శాతం ఉత్తీర్ణత

శుక్రవారం, 30 జులై 2021 (15:03 IST)
దేశంలో 12వ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను రిలీజ్ చేసింది. ఈ యేడాది కరోనా వైరస్ రెండో దశ అల కారణంగా 10, 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ బోర్డు జాతీయ స్థాయిలో రద్దు చేసిన విషయం తెల్సిందే. 
 
దీంతో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసింది. 
 
ఈ ఫలితాలను cbseresults.nic.in వెబ్‌సైటులో చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నెం, స్కూల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా క్వాలిఫైయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్మెంట్ కేటగిరీలో ఉంచనున్నారు. అయితే.. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి పరిస్థితులు చక్కబడ్డాక ఎగ్జామ్ రాసి వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బోర్డు తెలిపింది. కాగా, మొత్తం 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఇందులో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు