ఎంబీఏ చదివి దొంగతనం చేస్తావా? సిగ్గు లేదూ... ఆ డబ్బు, నగలు అక్కడ పెట్టేయ్... భార్య

బుధవారం, 13 జూన్ 2018 (15:25 IST)
దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతోంది. చదువుకున్న యువత జీవనోపాధి లేకుండా చివరికి దొంగతనం వృత్తిగా మార్చుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఎంబీఏ వరకు చదివిన ఇళవది ఉద్యోగం లేక దొంగగా మారాడు. వివరాలలోకి వెళితే చైన్నై తిరువికనగర్ ప్రభు వీధికి చెందిన అరివళగన్ కుటుంబంతో పాటు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే తలుపులు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 
 
సహాయ కమీషనర్ హరికుమార్ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే బీరువాలో ఉన్న 12 సవర్ల బంగారు నగలు కనిపించకపోగా, రూ.70 వేలు మాత్రం అలాగే ఉండటంతో అరివళగన్‌కి తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. అక్కడే అద్దెకు ఉంటున్న వారిని కూడా పోలీసులు విచారించారు. తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడికి చెందిన ఇళమదిని విచారించడంతో, ఆ చోరీకి పాల్పడింది తానే అంటూ అంగీకరించాడు. 
 
మూడు నెలల ముందు అరివళగన్ ఇంటిలో అద్దెకు దిగాడు. ఇంటి యజమాని విలాసవంతమైన జీవితాన్ని చూసి అతని ఇంట్లో దొంగతనం చేయాలని పథకాన్ని రచించాడు. పథకం ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసి తన భార్యకు ఇచ్చాడు. అతడు చేసిన పనికి భార్య షాక్ అయ్యింది. ఎంబీఎ చదివి దొంగతనం చేస్తావా... సిగ్గు లేదూ... అంటూ మందలించి వాటిని తీసిన చోటనే పెట్టమని చెప్పేసింది. దాంతో వాటిని అక్కడే పెట్టడానికి వెళ్లాడు. ఆ లోపు అరివళగన్ ఇంటికి తిరిగి రావడంతో కాజేసిన నగలను ఓ బంధువు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే అరివళగన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరు గంటలలోపు ఇళమదిని అరెస్టు చేసి, నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు