వివాహేతర సంబంధం భర్త ప్రాణాన్ని బలిగొంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తను పాము కాటుతో చంపేయాలనుకుంది. భర్త పడుకున్న పడక గదిలోకి పామును వదిలింది. తీరా ఆ పాము ఎటో వెళ్లిపోవడంతో... ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను దొడ్డుకర్రలతో బాధి చంపేసింది. ఈ దారుణ ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
ఆ వివరాలను పరిశీలిస్తే.. ఐదేళ్ల క్రితం పట్టణంపూడూరుకు చెందిన శారద, శక్తివేలుకు వివాహమయ్యింది. కాగా పెళ్లికి ముందే శ్రీనగర్కు చెందిన సుందరంతో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. తన అక్రమసంబంధానికి భర్త అడ్డుగా వస్తాడని భావించి అతడిని ఎలాగైనా చంపేయాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. పథకం ప్రకారం పాములు పట్టే వ్యక్తికి రూ.15వేలు ఇచ్చి త్రాచు పామును భర్త నిద్రిస్తున్న గదిలోకి వదిలారు.
అయితే ఆ పాము అతడిని కాటేయకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో చేసేదిలేక సుందరం అతని స్నేహితుడు రాధాకృష్ణలతో కలిసి నిద్రిస్తున్న భర్తను దొడ్డు కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో శక్తివేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం ఎవరికి కనిపించకుండా ఇంట్లో ఉండే నీళ్ల తొట్టి అడుగున పాతిపెట్టారు. కాగా శక్తి వేలు కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి శారద, ఆమె ప్రియుడు సుందరం, అతని స్నేహితుడు రాధాకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.