ఏపీలో మరో 48 మంది కరోనా... టాప్-10లోకి భారత్

మంగళవారం, 26 మే 2020 (11:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 48 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,148 శాంపిళ్లను పరీక్షించగా ఈ కేసులు నిర్ధారణ అయినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 55 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,719 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 759 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,903 మంది డిశ్చార్జ్ అయ్యారు. తూర్పు గోదావరిలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 57కి చేరింది.
 
టాప్-10లోకి భారత్ 
దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ వందల వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ కరోనా జోరుగు ఏమాత్రం బ్రేకులు లేకుండా పోతున్నాయి. ఫలితంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం కేసులు ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నమోదైనవే కావడం గమనార్హం. 
 
తాజా గణాంకాల మేరకు కరోనా కేసుల్లో భారత్ ప్రపంచ స్థాయిలో పదో స్థానానికి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,38,845 కరోనా కేసులు నమోదైవున్నాయి. అలాగే, 4021 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 77103 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అంటే 24 గంటల్లో 6977 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, దేశంలో నమోదైన కేసులో మంగళవారం ఉదయం వరకు మహారాష్ట్రలో 50231 కేసులు నమోదైవుండగా, తమిళనాడులో 16277, గుజరాత్‌లో 14056, ఢిల్లీలో 13418 కేసుల చొప్పున నమోదైవున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు