అంతర్వేదిలో పోలీసులకు కరోనా.. తెలంగాణాలో తగ్గిన కేసులు

సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని రథం దగ్ధం తర్వాత బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అదనపు ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌రెడ్డి‌తోపాటు 10 మంది పోలీసులు ఉన్నారు.
 
పరీక్షల్లో తమకు కరోనా సోకినట్టు ఎస్పీ అస్మి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 850 మంది పోలీసులు ఈ మహమ్మారి బారినపడినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఆలయ రథం దగ్ధమైన తర్వాత అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. 
 
నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజూ నిరసనలు జరుగుతుండటంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపేందుకు కేసును సీబీఐకు అప్పగించింది. 
 
మరోవైపు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,417 కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా నమోదైన కేసులతో పోలిస్తే తాజా కేసుల సంఖ్య తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే తీరు కొనసాగితే... రాష్ట్రంలో కరోనా విస్తరణ తగ్గుముఖం పట్టినట్టుగా భావించొచ్చు.
 
మరోవైపు తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,513కి చేరుకుంది. ఇదే సమయంలో మరణాల సంఖ్య 974కి పెరిగింది. గత 24 గంటల్లో 13 మంది కరోనాతో చనిపోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధిక కేసులు (264) జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి జిల్లా 133, కరీంనగర్ జిల్లా 108 ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు