ఆదివారం ఒక్కరోజే ఆరు కరోనా మరణాలు... ఏపీలో కొత్త కేసు నమోదు శూన్యం

ఆదివారం, 29 మార్చి 2020 (17:49 IST)
దేశంలో కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 25కి చేరింది. ఆదివారం ఒక్క రోజే ఆరుగురు మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త అగర్వాల్ లవ్ అగర్వాల్ తెలిపారు. అలాగే, దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 979గా ఉందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు 979 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. దేశం మొత్తమ్మీద 25 మంది కరోనాతో మృతి చెందారని వివరించారు. మృతి చెందినవారిలో ఎక్కువగా మధుమేహ వ్యాధి, బీపీ, కిడ్నీ వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్టు తేలిందన్నారు. 
 
కాగా, దేశంలో కరోనా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 6 రాష్ట్రాల్లో కొత్తగా 106 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఆరుగురు మృతి చెందారని తెలిపారు. 
 
ఆసుపత్రుల్లో కరోనా బాధితులు, ఇతర రోగులను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు వెంటిలేటర్‌పై ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని పంచుకోలేమని, రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. 
 
అటు, గూడ్సు రైళ్ల ద్వారా ఆహార ధాన్యాలు, చక్కెర, ఉప్పు, పెట్రోలియం, బొగ్గు సరఫరా చేస్తామని కేంద్రం పేర్కొంది. గత 5 రోజుల్లో 1.25 లక్షల వ్యాగన్ల ద్వారా నిత్యావసర వస్తువుల రవాణా జరిగిందని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాక వెల్లడించింది. అయితే, ఏపీలో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. 
 
ఆదివారం వచ్చిన రిపోర్టుల్లో 16 మందికి నెగెటివ్ వచ్చిందని, 195 మందిని ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచామన్నారు. ఈ మేరకు కరోనాపై ఏపీ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. 
 
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 29,367 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 19 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు