ఏపీలో మరో 57 కొత్త కేసులు... అమెరికాలో కరోనా విశ్వరూపం

మంగళవారం, 19 మే 2020 (11:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల మరో 57 నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,739 శాంపిళ్లను పరీక్షించగా మరో 57 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదేసమయంలో 69 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. 
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,339 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 691 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,596 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిత్తూరు జిల్లాలకు చెందిన వారు ఒకరు, కర్నూలు జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది.
 
ఇకపోతే, అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. అదేసమయంలో కరోనాతో 785 మంది మృతి చెందారు. ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,03,308గా ఉంది. మృతుల సంఖ్య 90,347కి చేరిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. 
 
కాగా, కరోనా వైరస్‌తో ప్రపంచ మొత్తం నమోదైన మృతుల సంఖ్యలో మూడో వంతు  అమెరికాలోనే ఉన్నాయి. ఆ దేశంలోని న్యూయార్క్‌లో ఇప్పటివరకు 3,51,371 పాజిటివ్‌ కేసులు, న్యూజెర్సీలో 1,48,240 కరోనా కేసులు, ఇల్లినాయిస్‌లో‌ 96,485, మసాచుసెట్స్‌ లో 87,052, కాలిఫోర్నియాలో 81,738 కేసులు నమోదయ్యాయి. 
 
అమెరికా తర్వాత రష్యాలో అత్యధికంగా 2,90,000 కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా ఆ దేశంలో ప్రతి రోజు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 48,00,000కు పైగా కేసులు నమోదు కాగా, 3,18,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు