నెల్లూరులో కరోనా వైరస్ అనుమానిత వ్యక్తి - హై అలెర్ట్

మంగళవారం, 10 మార్చి 2020 (10:35 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనేక ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద దేశాలకు పాకింది. అలాగే, భారత్‌లో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం వరకు మొత్తం 43 కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. ఇదిలావుంటే, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ అనుమానిత వ్యక్తిని ఒకరిని గుర్తించారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు పట్టణంలోని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చాడు. ఎయిర్ పోర్టులో దిగిన సమయంలో థర్మల్ స్క్రీనింగ్‌ నిర్వహించగా, ఈ పరీక్షల్లో ఎలాంటి జ్వర లక్షణాలూ లేకపోవడంతో బయటకు పంపించారు. కానీ, ఇంటికి రాగానే కరోనా లక్షణాలు అతనిలో కనిపించాయి. 
 
ఆ వ్యక్తికి జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండటంతో, అతని కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు అతనిలో ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. అతని కుటుంబీకులను కూడా అదే వార్డులోని ప్రత్యేక గదిలో ఉంచి, పరిశీలిస్తున్నారు.
 
సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. జిల్లా యంత్రాంగం జిల్లాతో పాటు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. గత రెండు మూడు రోజులుగా, బాధితుడు ఎవరెవరిని కలిశాడన్న విషయమై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. 
 
ఇతను కలిసిన వ్యక్తులను సంప్రదిస్తూ, వారిని జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం జలుబు, జ్వరం లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. బాధితుడిని కలిసిన వారు ఎక్కడెక్కడ తిరిగారన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు