దేశంలో కోటి సంఖ్యకు చేరువైన కరోనా పాజిటివ్ కేసులు

శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:07 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మన దేశంలో కోటి సంఖ్యకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 22889 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,79,447కు చేరుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఇక గత 24 గంటల్లో 31,087 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 338 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,44,789కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 95,20,827 మంది కోలుకున్నారు. 3,13,831 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,89,18,646 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,13,406 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 551 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 682 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,195 కి చేరింది. 
 
ఇప్పటివరకు మొత్తం 2,71,649 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,506కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,040 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,955 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 63,54,388 కరోనా పరీక్షలు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు