ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి - మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు కరోనా

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (18:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకుతున్న వారిలో రాష్ట్ర ప్రజలతో పాటు.. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కరోనా బారినపడ్డారు. షరీఫ్‌కు కరోనా పాజిటివ్ రావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. షరీఫ్ సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.  
 
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా కరోనా సోకింది. ఏపీలో ఇప్పటి వరకు 4,34,771 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,30,526 మంది కోలుకున్నారు. మొత్తం 3,969 మంది దీని బారిన పడి ప్రాణాలు వదిలారు.
 
కాగా, ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారిలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వంటి రాజకీయనేతలు ఉన్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి, మండలి ఛైర్మన్ షరీఫ్‌లకు ఈ వైరస్ సోకింది. 
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు