కరోనా వైరస్ సోకి బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత.. ఎక్కడ?

సోమవారం, 30 నవంబరు 2020 (09:59 IST)
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా మరణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్ కన్నుమూశారు. ఆమెకు వయసు 59 యేళ్లు. 
 
కొన్ని రోజుల క్రితం ఈ వైరస్ బారినపడిన ఆమె... గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆమె ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె 2004లో ఉదయపూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఉదయపూర్ నుంచి సచిన్ పైలట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు.
 
కరోనా అన్‌లాక్ తర్వాత తన సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. మూడు వారాల కిందట కరోనా లక్షణాలతో మేదాంత హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమెకు ఆధునిక వైద్య చికిత్సను అందిస్తూ వచ్చారు. కానీ, ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ పరిస్థితుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి విషయమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. 
 
రాష్ట్రంలో కరోనా మహమ్మారితో మరణించిన రెండో ఎమ్మెల్యే ఆమె కావడం గమనార్హం. ఇటీవలే సహద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కైలాష్‌ త్రివేది భిల్వారా మహమ్మారి బారినపడి మృతి చెందారు. కిరణ్‌ మహేశ్‌ మృతికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరరాజే సంతాపం ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు