తెలంగాణలో కరోనా మహమ్మారి-నల్లగొండలో మూడు కేసులు

శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:38 IST)
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నల్లగొండ జిల్లాలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు విలేకరులకు తెలిపారు. వీరిలో ఇద్దరు బర్మాదేశీయులు కాగా, దామరచర్ల మండలకేంద్రానికి చెందిన మహిళ ఉన్నారని ఆయన ప్రకటించారు. 15మంది బర్మా దేశస్తులు, మరో ఇద్దరు కాశ్మీర్‌ యువకులు మతప్రచారం కోసం మార్చి 15న హైదరాబాద్‌ నుంచి నల్లగొండకు చేరుకున్నారు.

ప్రార్థనా మందిరాల్లో విడిది చేయడంతో వీరికి కరోనా సోకిందని తెలిసింది. వీరిని గుర్తించిన పోలీసులు, వైద్యాధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఫీవర్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బర్మా దేశస్తుల్లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా యంత్రాంగం శుక్రవారం ప్రకటించింది. ఇక దామరచర్ల మండల కేంద్రానికి చెందిన దంపతులు ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని ఇంటికి చేరుకున్నారు. అధికారులు క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు జరిపించగా మహిళకు కరోనా పాజిటివ్‌ తేలింది.

తబ్లీగి జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోపాటు, వారితో సన్నిహితంగా మెలిగిన వారితో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య , ఒక్కసారిగా పెరుగుతుండడం రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 75 కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించాడు. ఇందులో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు .

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు