చెన్నై మహానగరానికి ఏమైంది? పుట్టగొడుగుల్లా "కరోనా" కేసులు

ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (21:22 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఒక్క ఆదివారమే ఒక్క చెన్నై నగరంలోనే ఏకంగా 50 కేసులు నమోదు కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 105 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1,477కు చేరింది. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ కరోనా కేసుల విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో నగర వాసులు భయంతో వణికిపోతున్నారు. ఆదివారం ఇద్దరు తమిళ విలేకరులకు కూడా ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో విలేకరుల కోసం ప్రత్యేకంగా కరోనా వైరస్ నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభించారు. 
 
ఇకపోతే, జిల్లాల వారీగా పరిశీలిస్తే, ఒక్క చెన్నై జిల్లాలో మొత్తం 285 కేసులు నమోదు కాదా, ఆ తర్వాత స్థానంలో కోయంబత్తూరు 133, తిరుపూరులో 108, దిండిగల్‌లో 74, ఈరోడ్‌లో 70, తిరునెల్వేలిలో 62, చెగల్పట్టులో 53, నామక్కల్‌లో 50 చొప్పున నమోదు కాగా, అతి తక్కువగా అరియలూరులో2, కల్లకుర్చిలో 3, పెరంబలూరులో 4, కాంచీపురంలో 8, నీలగిరిలో 9 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు, తమిళనాడులో కరోనా బారినపడి ఇప్పటివరకూ 15 మంది చనిపోయారు. ఆదివారం కరోనా నుంచి కోలుకున్న 46 మందిని డిశ్చార్జ్ చేయడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 411కు చేరింది. ఇదిలావుంటే.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ సడలింపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు