దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా.. అప్రమత్తతే శ్రీరామరక్ష!

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (16:00 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత మూడు రోజులుగా వరుసగా లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గతేడాది కంటే కరోనా 2.0 వ్యాప్తి మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్లో శరవేగంగా జరుగుతోంది. 
 
ఇప్పటికే దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నా.. కొవిడ్‌ కట్టడే లక్ష్యంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగకపోవడం కలవరపెడుతోంది. 
 
ప్రజల్లో ఉదాసీనత, నిర్లక్ష్య ధోరణుల వల్లే వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీకా వేయించుకోవడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం వల్లే ఈ మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమంటున్నారు.
 
ఈ పరిస్థితుల్లో నిరంతరం అప్రమత్తతే రక్షణ కల్పిస్తుంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, వైద్య నిపుణులు ప్రభుత్వాలు చెబుతున్నట్టుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని ఆయన వెల్లడించారు.
 
 
ఈ జాగ్రత్తల్లో భాగంగా, మాస్క్‌లు ధరించకుండా బయటకు వెళ్లొద్దు. మాస్కులేని సంచారం రిస్కుతో కూడిన వ్యవహారం. మాస్క్‌ లేకుండా తిరిగితే కఠిన చర్యలకు అవకాశం. బస్సులు, థియేటర్లు, మార్కెట్ల వద్ద అప్రమత్తతే రక్షణ.
 
అనవసరంగా బయట తిరగవద్దు. ఒక వేళ అత్యవసర పనులకు బయటకి వెళ్లాల్సి వచ్చినా.. రద్దీ ప్రాంతాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. బయటకి వెళితే మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేసింది. 
 
శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలి. కళ్లు, ముక్కు, నోటిని నేరుగా చేతులతో తాకొద్దు. గోరువెచ్చని నీటిని తాగండి. కరచాలనం కంటే నమస్కారం ఆరోగ్యకర పలకరింపు. జలుబు, ఆగని దగ్గు, గొంతునొప్పి, జ్వరం కరోనా అనుమానిత లక్షణాలు. వేడుకల్లో గుంపులుగా తిరగడం మంచిది కాదు. కరోనా లక్షణాలుంటే విధిగా పరీక్ష చేయించుకోవాలి. 
 
అపోహలు వీడి వ్యాక్సిన్‌ వేయించుకోండి. వ్యాక్సిన్‌ వేసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందే. షాపింగ్‌కు వెళ్తే డిజిటల్‌ పేమెంట్స్‌కు ప్రాధాన్యమివ్వండి. బయటి నుంచి తీసుకొచ్చిన వస్తువులను శుభ్రపరిచి వినియోగించండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు