'ఆ రోజంటూ వస్తే ఎవరైనా గతించక తప్పదు' ... కలాం మృతిపై గంగూలీ కామెంట్స్

మంగళవారం, 28 జులై 2015 (16:57 IST)
ఆ రోజంటూ వస్తే ఎవరైనా గతించక తప్పదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అంటున్నారు. సోమవారం షిల్లాంగ్‌లో అకాలమరణం చెందిన భారత మాజీ రాష్ట్రపతి మృతిపై స్పందిస్తూ కలాంను పలుమార్లు కలిశాను. వ్యక్తిగతంగానూ ఎంతో పరిచయం. ఆయన నిరాడంబరుడు అన్న విషయం నేనే కాదు, ఆయనను కలిసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. ఆ సులక్షణం కారణంగానే ఎందరో ఆయనకు అభిమానులయ్యారు.
 
కలాం నిరాడంబరత తననే కాదని, ఆయనను కలిసిన ఎవరినైనా ఆకట్టుకుంటుందన్నారు. కలాం భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించారు... ఆయన ఓ సైన్స్ మేధావి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞావంతుడు. ఆ రోజంటూ వస్తే ఎవరైనా గతించక తప్పదు" అంటూ గంగూలీ వ్యాఖ్యానించారు.
 
అలాగే, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా అబ్దుల్ కలాం మృతిపై సంతాప ప్రకటన విడుదల చేసిన విషయంతెల్సిందే. ఇందులో జాతి యావత్తూ విషాదంలో మునిగిపోయింది. కలాం మాకందరికీ స్ఫూర్తి ప్రదాత. గొప్పవ్యక్తి.. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అంటూ సచిన్ పేర్కొన్నారు.
 
అలాగే, టెన్నిస్ తార సానియా మీర్జా స్పందిస్తూ ఈ రోజు ఎంతో విషాదకరమైనది. కలాంకు శ్రద్ధాంజలి. అదేవిధంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా స్పందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నారు. కలాం సాబ్‌కు శాంతి చేకూరాలి అంటూ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి