ఆస్ట్రేలియా ఘన విజయం... భారత్ రికార్డును అధిగమించిన కంగారులు

గురువారం, 5 మార్చి 2015 (06:59 IST)
ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చెలరేగిపోయింది. ఎనిమిదేళ్ల కిందట భారత్ చేసిన రికార్టును అధిగమించింది. ఆప్ఘనిస్తాన్ పై ఘనవిజయం సాధించింది. మొదట నుంచే ఆటపై ఆదిపత్యాన్ని చెలాయించింది. అత్యధిక స్కోరు, అత్యధిక భాగస్వామ్యం ఇలా ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తూనే విజయాన్ని ఒంటి చేత్తో అందుకున్నారు. విరాలిలా ఉన్నాయి. 
 
అఫ్గానిస్తాన్ పై ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఆప్ఘనిస్థాన్ 142 పరుగులకు ఆలౌట్‌కావడంతో, ఆసీస్ 275 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. ఈ మెగాటోర్నీలో ఇదే అతి పెద్ద విజయం. డేవిడ్ వార్నర్ 176 పరుగులు సాధించగా, ఆసీస్ 6 వికెట్లకు 417 పరుగులు చేసి, ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది.
 
వరల్డ్ కప్‌లో భారత్ రికార్డును ఆస్ట్రేలియా బద్ధలు కొట్టింది. పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 417 పరుగులు చేసింది. దీంతో ఇప్పటి వరకు భారత్ పేరిట ఉన్న 413 పరుగుల రికార్డు బద్ధలైంది. 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై భారత్ 5 వికెట్ల నష్టానికి 413 పరుగులు చేసింది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, ఆదిలోనే ఫించ్ వికెట్ కోల్పోయినప్పటకీ... మిగిలిన బ్యాట్స్ మెన్ అదుర్స్ అనిపించేలా బ్యాట్‌ను ఝళిపించారు. ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశారు. వార్నర్ 178 (133), స్మిత్ 95 (98), మ్యాక్స్ వెల్ 88 (39 బంతులు, 7 సిక్సర్లు, 6 ఫోర్లు) పరుగులతో విజృంభించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ఆడిన ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 417 పరుగులు భారీ స్కోర్‌ను చేసింది. అనంతరం 418 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ జట్టు.. 142 పరుగలకే ఆలౌట్ అయ్యి ఓటమి పాలయ్యింది. 

వెబ్దునియా పై చదవండి