కోహ్లీ ప్రవర్తనపై నిఘాపెట్టిన బీసీసీఐ: ఇదంత తేలికగా మాట్లాడేది కాదు!

శనివారం, 25 ఏప్రియల్ 2015 (12:46 IST)
ప్రపంచ కప్‌లో ధీటుగా రాణించలేకపోయిన యువ క్రికెటర్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తనపై బీసీసీఐ నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. అతని ప్రవర్తనను పరిశీలిస్తున్నామని బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా చెప్పారు. "సరే, అతని (కోహ్లీ ప్రవర్తన)పై పరిశీలన ఉంటుంది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే తప్పకుండా తీసుకుంటాం" అని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో దాల్మియా వెల్లడించారు. తానిది కావాలని చెప్పడంలేదని, అంతా బాగానే ఉందని కూడా అనడంలేదన్నారు. 
 
ఒకవేళ కోహ్లీ వైఖరిపై చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందా అని నిర్ణయించే ముందు తాను కూడా అతనిని పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఇదంత తేలికగా మాట్లాడేది కాదని దాల్మియా పేర్కొన్నారు. ప్రపంచకప్ సమయంలో ఓ విదేశీ జర్నలిస్టుపై, అంతకుముందు దేశీయ ఆటల్లో, తాజా ఐపీఎల్ ల్లోనూ పలుసార్లు కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ విఫలమవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఆటతీరు, ప్రవర్తనపై బీసీసీఐ కన్నేసింది.

వెబ్దునియా పై చదవండి