చిక్కుల్లో షమీ.. చార్జిషీటు దాఖలు.. ప్రపంచ కప్‌కు అనుమానమే...

శుక్రవారం, 15 మార్చి 2019 (10:00 IST)
భారత క్రికెటర్ మహ్మద్ షమీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై చార్జిషీటు దాఖలైంది. ఫలితంగా వచ్చే మే నెలలో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలకు షమీ ఎంపికయ్యే విషయంపై ఇపుడు సందేహం నెలకొంది. 
 
షమీ, ఆయన భార్య హసీన్ జహాన్‌ల మధ్య గత కొన్ని నెలలుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. షమీపై జహాన్ అనేక ఆరోపణలు చేసింది. దీంతో వారిద్దరూ విడిపోయి గత కొంతకాలంగా వేర్వేరుగా జీవిస్తున్నారు. పైగా, షమీపై జహాన్ కేసు పెట్టింది కూడా. 
 
ఆమె ఫిర్యాదు నేపథ్యంలో, తాజాగా కోల్‌కతా పోలీస్ శాఖ మహిళల గ్రీవెన్స్‌సెల్ షమీపై సెక్షన్ ఐపీసీ 498ఏ, సెక్షన్ 354ఏ కింద చార్జిషీట్ నమోదు చేసింది. వీటిలో 498ఏ సెక్షన్ ఓ మహిళపై భర్త కానీ, ఇతర బంధువులు కానీ హింసకు పాల్పడిన సందర్భాల్లో ఉపయోగిస్తారు. 354ఏ సెక్షన్‌ను ఓ మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు ప్రయోగిస్తారు.
 
అయితే, షమీకి ఊరట కలిగించే విషయం ఏమిటంటే... ఈ కేసులో తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి సెక్షన్ 307, సెక్షన్ 376 అభియోగాలను తొలగించారు. వీటిలో 307 హత్యాయత్నంకు సంబంధించినది కాగా, 376 అత్యాచారానికి సంబంధించిన సెక్షన్. ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్టులో షమీ కూడా ఉంటాడన్న నేపథ్యంలో తాజా చార్జిషీట్ సమస్యాత్మకంగా మారే అవకాశముందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు