క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ క్రికెట్ వల్లే క్రీడాకారులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ హ్యూస్ మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదమైన ఘటన చోటు చేసుకుంది. అదే తరహాలో కోల్కతాలో అంకిత్ కేసరీ(20) అనే యువ క్రికెటర్ మృత్యువుతో పోరాటం చేసి సోమవారం తుదిశ్వాస విడిచాడు. గత రెండేళ్ల నుంచి బెంగాల్-19 కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేస్రీ.. ఈ సంవత్సరం బెంగాల్ అండర్-23 విభాగానికి ఎంపికయ్యాడు.
ఇకపోతే.. కేసరి మృతి వార్త విని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చలించిపోయాడు. ఇదో విషాదకరమైన వార్త అని ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నాడు. అంకిత్ మరణవార్త విని విషాదానికి లోనయ్యానని, అతని ఉజ్వలమైన కెరీర్ దురదృష్టకరమైన ఘటన కారణంగా అర్థాంతరంగా ముగిసిపోయిందని పేర్కొన్నాడు. అతని కుటుంబానికి, బంధుమిత్రులకు దేవుడు సాంత్వన చేకూర్చాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు.
క్లబ్ క్రికెట్ ఆడుతూ, క్యాచ్ పట్టే క్రమంలో ఫీల్డర్ను ఢీకొని కేసరి తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న కేసరి తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. కోలుకుంటున్నాడని అందరూ సంతోషంగా ఉన్నంతలో, ఈ ఘటన జరగడంతో బెంగాల్ క్రికెట్ వర్గాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.