రిటైర్మెంట్ కానున్న ధోనీ? అసలు కథ ఇదీ!

మంగళవారం, 5 డిశెంబరు 2017 (08:56 IST)
ప్రస్తుతం శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. ఈనెల 10వ తేదీ నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా 13వ తేదీన మొహాలీలో రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్ కానున్నారు. అయితే, ధోనీ అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? ధోనీపై విమర్శలను ప్రముఖంగా ప్రసారం చేసిన మీడియా ఈ విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది? తదితర ఆలోచనల్లో పడిపోయారా? అయితే మీరు పూర్తిగా చదవాల్సిందే.
 
మొహాలీ వన్డే తర్వాత ధోనీ రిటైర్ అవనున్న మాట వాస్తవమే కానీ, ఆ ధోనీ టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కాదు. మొహాలీ జిల్లా పోలీస్ శాఖలో గత పదేళ్లుగా సేవలందిస్తున్న శునకం. 'ధోనీ' తన కెరీర్‌లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) స్టేడియానికి విశేష సేవలు అందించింది. 
 
అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారీ స్టేడియాన్ని చెక్ చేసేది. 2011 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్-పాక్‌లు ఇక్కడే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు అప్పటి ఇరు దేశాల ప్రధానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలో సెక్యూరిటీని పర్యవేక్షించిన బృందంలో 'ధోనీ' కూడా ఉన్నట్టు దాని కేర్‌టేకర్ అమ్రిక్ సింగ్ తెలిపారు. కాగా, మొహాలీ మ్యాచ్‌ తర్వాత ధోనీతోపాటు జాన్, ప్రీతి కూడా పోలీస్ శాఖ నుంచి రిటైర్ కానున్నాయి. అదన్నమాట ధోనీ రిటైర్మెంట్ వెనుక కథ.


 

Dhoni to retire after 2nd ODI against Sri Lanka on December 13! https://t.co/qKFf95SEly#INDvSL #INDvsSL pic.twitter.com/Zue03D5KjP

— DNA (@dna) December 4, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు