ట్వంటీ-20 ప్రపంచకప్... టైటిల్ రేసు నుంచి ఆస్ట్రేలియా అవుట్

శనివారం, 5 నవంబరు 2022 (22:55 IST)
ట్వంటీ-20 ప్రపంచకప్ టైటిల్ రేసు నుంచి డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 
 
ఈ గెలుపుతో ఇంగ్లండ్ మెరుగైన రన్‌రేట్ ప్రాతిపాదికన సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-1 నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఇంగ్లండ్ కూడా కివీస్ సరసన నిలిచింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. ఇద్దరు లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.
 
కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన హేల్స్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. 
 
హారి బ్రూక్ )4), లివింగ్‌స్టోన్ (4) మోయిన్ అలీ (1), శామ్ కరన్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బెన్‌స్టోక్స్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. 
 
చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ రెండు ఫోర్లతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ రెండు బంతులు మిగిలివుండగానే గెలిచి సెమీస్‌కు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు