ఒలింపిక్స్‌లో సత్తా చాటిన మను బాకర్ - విషెస్ చెప్పిన సీఎం బాబు - డిప్యూటీ సీఎం పవన్

వరుణ్

సోమవారం, 29 జులై 2024 (11:05 IST)
ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి, హర్యానా అమ్మాయి మను బాకర్ సత్తా చాటారు. దేశానికి తొలి పతకం అందించారు. ఈ పోటీల్లో కాంస్యం సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ అంశంలో మను బాకర్ మూడో స్థానంలో నిలిచి పతకం చేజిక్కించుకుంది. తద్వారా, ఒలింపిక్స్ షూటింగ్ క్రీడాంశంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. దాంతో, ఈ యువ షూటర్‌‌పై అభినందనల వర్షం కురుస్తోంది.
 
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌లు మను బాకర్ సాధించిన ఘనత పట్ల స్పందించారు. "ఒలింపిక్స్‌లో షూటింగ్ క్రీడలో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళగా అవతరించినందుకు మను బాకర్‌కు శుభాభినందనలు. అంతేకాదు, మను బాకర్ సాధించిన కాంస్యం పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు తొలి పతకం" అని సీఎం చంద్రబాబు వివరించారు.
 
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ, "పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశానికి తొలి పతకం అందించిన యువ షూటర్ మను బాకర్‌కి హృదయపూర్వక అభినందనలు. 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యం సాధించారు. మను బాకర్ - ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ కావడం సంతోషదాయకం. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేందుకు ఇది నాంది" అని పేర్కొన్నారు. 
 
మంత్రి నారా లోకేశ్ కూడా ట్వీట్ చేశారు.. 'ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి తొలి పతకం అందించిన మను బాకర్‌కు అభినందనలు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్రీడాంశంలో మను బాకర్ సాధించిన కాంస్యం స్ఫూర్తిగా మన క్రీడాకారులు ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు